సాటి లేని తొలి తెలుగు సినీ కళాకారిణి శ్రీమతి భానుమతి
మహానటి భానుమతి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
"సాహిత్య కళా విభూషణ"
చౌడూరి నరసింహారావు
పత్రికారచయిత, విశ్లేషకులు
1925 వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని దొడ్డవరం గ్రామంలో భానుమతి జన్మించారు. హీరోయిన్లుగా ఆడవారి వేషాలు కూడా మగవారే వేసే ఆ రోజుల్లో ధైర్యంగా నేనున్నానంటూ కేవలం 13 ఏళ్ల ప్రాయంలోనే ఇంట్లో సనాతన కట్టుబాట్లను సైతం ఎదిరించి, సంప్రదాయ సంగీత కళాకారుడైన తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్యను ఒప్పించి, సినిమాలలో వేషం కట్టారు భానుమతి. తండ్రి స్ఫూర్తితో తాను కూడా సంప్రదాయ సంగీతాన్ని, నృత్యాన్ని శ్రద్దగా నేర్చుకొని, అపార సంగీత జ్ఞానాన్ని సమపార్జించుకొని అచిరకాలంలోనే మంచి కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1939 లో సుప్రసిద్ధ దర్శకుడు సి. పుల్లయ్య తీసిన వర విక్రయం సినిమాలో ఆమె "స్వాతంత్ర్యమే లేదా? స్త్రీ జాతికి అన్న పాట, జాతికి ఈ సూత్రంబె" అన్న పాట పాడారు. ఆ పాటలు ఆ రోజుల్లో ఇంటింటా మారుమ్రోగాయి. సినిమా ఘన విజయం సాధించింది. తర్వాత సి పుల్లయ్య 1940 లో తీసిన మాలతీ మాధవం లో ఆమెకు నాయక పాత్రను ఇచ్చారు. ఆ చిత్రం పరాజయం పొందింది. అయినా సరే, ఆమె నిరాశతో వెనుకడుగు వేయలేదు. ఇంకా ఉత్సాహంతో ముందుకు నడిచి.. ధర్మపత్ని, భక్తి మాల సినిమాలలో అద్భుతంగా నటించి గొప్ప కీర్తిని గడిచింది.
రామకృష్ణారావుతో వివాహం
అయితే 1943 లో కృష్ణ ప్రేమ సినిమాలో నటించింది భానుమతి ఈ కృష్ణ ప్రేమ కాస్తా రామకృష్ణ ప్రేమగా మారింది. అంటే ఆ సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేసిన రామకృష్ణారావును భానుమతి ఇష్టపడి 1943 ఆగస్టు 8వ తేదీన వివాహం చేసుకుంది. వీరిద్దరి ఏకైక కుమారుడే భరణి కుమారుడి పేరు మీదనే భరణి సంస్థ స్థాపించిన ఆ దంపతులు అనేక అపూర్వ చిత్రాలను అందించారు. ఆరోజుల్లో చిత్రాల్లో ఆమె హీరోతో సమానమైన పాత్రలని ఒప్పుకునేవారు. పారితోషకంలోనూ హీరోలతో సమానంగానే పోటీపడేవారు. ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే అలవాటు ఆమెది. అందువల్ల అందరూ ఆమెకు తల పొగరు, అహంకారం అనుకునేవారు అయినా ఆమె ఎన్నడూ చలించలేదు. అహంకారం నాకు అలంకారమే! అని తెగేసి చెప్పేవారు.
'స్టార్' గా నింగికెగసిన కీర్తికేతనం
1946 లో బి.ఎన్.రెడ్డి దర్శకత్వం వహించిన స్వర్గసీమ తో భానుమతి గొప్ప నటి గా ప్రశంసలు పొంది, 'స్టార్' గా ఎదిగారు దక్షిణాది రాష్ట్రాల్లో స్వర్గసీమ విజయ శంఖం మ్రోగించడంతో భానుమతి కీర్తి పతాకం మింటికి ఎగిసింది. స్వర్గసీమలోని ఆమె పాత్ర అమాయకురాలైన కూచిపూడి నాట్యగత్తె. ఈ పాత్రలోని దశలు భానుమతి నటనా శక్తికి గీటురాళ్లు అనవచ్చు. సహజంగా సంభాషణలు చెప్పడంలో, పాడడంలో ఆమెకు ఆమే సాటి. అని ఈ చిత్రం ద్వారా ఆమె నిరూపించుకున్నారు. భానుమతి మధురమైన గాయని ఆమె కంఠం సుడులు చక్రాలు తిరిగినట్టు పలుకుతుంది. ఆమెను అనుసరిస్తూ పాడడం అంత తేలికైన విషయం కాదు. భానుమతి వేరెవరికి ప్లే బ్యాక్ పాడలేదు. తనకెవరు పాడలేదు. అయితే చండీరాణి హిందీలో మాత్రం సంధ్య కి భానుమతి గాత్ర దానం చేశారు.
సన్మానాలు పురస్కారాలు బిరుదులు
భానుమతిలో మంచి హాస్యం, వ్యంగ్యం, చమత్కారం చక్కటి మేళవింపుతో కనిపిస్తాయి. అవన్నీ కలగలిపి ఆమె "అత్తగారి కథలు" రాశారు. అవి తెలుగు నాట బహుళ ప్రసిద్ధి పొందినాయి. ఆ రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. విప్రనారాయణకు సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకుడైనా భానుమతి సంగీత పర్యవేక్షణ అంటూ తన పేరు వేసుకున్నారు. తాను పాటలకి స్వర కల్పన చేసినా రికార్డింగ్ మాత్రం సత్యం చేత, వేణు చేత చేయించారు. ఆమె నటనా ప్రతిభకు 1966 లో పద్మశ్రీ, 2000 లో పద్మభూషణ్, 1975 లో ఆంధ్రా యూనివర్సిటీ డాక్టరేట్ పురస్కారాలు బహూకరించాయి. భానుమతి మూడుసార్లు జాతీయస్థాయి ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు. తమిళనాట కూడా ఆమె చిత్రాలు విజయ దుందుభులు మ్రోగించాయి. అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై భానుమతికి ప్రతిష్టాత్మకమైన 'కలైమామణి' బిరుదును ఇచ్చి సత్కరించడం విశేషం. తమిళనాట ఆమెను 'తెలుగు సినీ అష్టావధాని' గా పిలిచేవారట. ఎందుకంటే అప్పటికే భానుమతి నటిగానే కాక తన పాత్రకు తానే పాటలు స్వయంగా పాడుకునేవారట.
బహుముఖ ప్రజ్ఞతో ఎందరికో ఆదర్శంగా నిలిచి
తన కుమారుడు భరణి పేరుతో భర్త రామకృష్ణ దర్శకత్వంలో చిత్ర నిర్మాణం ఆరంభించి రత్నమాల, లైలామజ్ను, ప్రేమ, చండీరాణి, చక్రపాణి, విప్రనారాయణ, చింతామణి, వరుడు కావాలి, బాటసారి, వివాహ బంధం, గృహలక్ష్మి, అంతా మనమంచికే, విచిత్ర వివాహం, అమ్మాయి పెళ్లి, మనవడి కోసం, రచయిత్రి, ఒకనాటి రాత్రి, భక్త దృవ మార్కండేయ తదితర చిత్రాలు నిర్మించారు చండీరాణిని మూడు భాషల్లో నిర్మించారు. భానుమతే డైరెక్షన్ చేశారు. ఇలా తెలుగులో మొదటి దర్శకురాలిగా పేరు తెచ్చుకున్నారు. వరుడు కావాలి, అమ్మాయి పెళ్లి, మనవడి కోసం, రచయిత్రి, ఒకనాటి రాత్రి, భక్త దృవ మార్కండేయ చిత్రాలకు కూడా ఆమెనే దర్శకత్వం వహించారు. దాదాపు 200 కు పైగా చిత్రాలలో నటించిన భానుమతి మూడు తరాల నటులతో పనిచేసిన ఆమె చివరికి నందమూరి తారకరామారావు కుమారుడు బాలకృష్ణతో 'మంగమ్మగారి మనవడు' చిత్రంలో నటించడమే గాక, ఆ చిత్రంలో 'టైటిల్ రోల్' ను కూడా పోషించారు. తన బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో సినీ జగత్తులో ఎన్నో సాధించి, ఎందరెందరికో ఆదర్శంగా నిలిచిన భానుమతి రామకృష్ణ 2005 వ సంవత్సరం డిసెంబర్ 24 వ తేదీన చెన్నైలోని స్వగృహంలో శాశ్వతంగా కన్నుమూశారు. ఆ మహానటి అనంత దూరాలకు వెళ్ళిపోయినా ఆమె గళం నుంచి జాలువారిన గీతాలు, ఆమె కలం నుంచి ఆవిష్కరించబడిన రచనలు ఎప్పటికీ అజరామరంగా నిలిచే ఉంటాయి. తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి.