
హైదరాబాదులోని హైటెక్ సిటీలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను పొందేందుకు జిల్లాలో గ్రామ పాలనాధికారులుగా ఎంపికైన వారిని శుక్రవారం జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ కు 7 ప్రత్యేక బస్సుల ద్వారా రెవెన్యూ అధికారులు తీసుకువెళ్లారు. ఆ బస్సులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కలెక్టర్ కార్యాలయం నుండి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.
గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్వోలుగా, విఆర్ఏ లుగా పనిచేసి ప్రస్తుతం ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వారికి ప్రభుత్వం తిరిగి రెవెన్యూ డిపార్ట్మెంట్ లోకి గ్రామ పాలన అధికారులుగా నియమించడానికి పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని కామారెడ్డి జిల్లాకు 363 మందిని ప్రభుత్వం కేటాయించింది. వారికోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి 335 మందికి హైదరాబాదుకు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వివిధ శాఖలలో పనిచేస్తూ మళ్లీ మాతృశాఖ అయిన రెవెన్యూ శాఖలో నియామకం పొందుతున్నందుకు అభినందించి రెవెన్యూ శాఖకు ఉత్తమ సేవలందించి మంచి గుర్తింపు పొందాలని సూచించారు. ఈ బస్సులలో ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థ సింహారెడ్డి, కలెక్టరేట్ ఏవో సయ్యద్ మసూద్ తదితరులు వెళ్లారు.