10న స్థానిక సంస్థల తుది ఓటరు జాబితా.
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు జిల్లా :
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈ నెల 10న వెలువరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ఓటరు జాబితా ప్రదర్శన చేయడం జరిగిందని అన్నారు. ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేర్పులు జరిపిన మీదట సెప్టెంబర్ 10న తుది జాబితా వెలువరిస్తామని సూచించారు. మండల స్థాయిలో నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కూడా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరడం జరిగిందన్నారు. తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, డిప్యూటీ సి ఈ ఓ రాజు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.