న్యాయస్థానాల్లో అవినీతి ?
( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )
- కదులుతున్న ప్రజాస్వామ్య పునాదులు.. ?
- న్యాయవాదులు అన్యాయం వాదిస్తున్నారు..
- రాజకీయాలు న్యాయస్థానాలను ప్రభావితం చేస్తున్నారు..
- ఎంతో ఉన్నతమైన న్యాయ వ్యవస్థ నిర్వీర్యమైపోతోందా..?
- అవినీతి న్యాయమూర్తుల కథలు ఆందోళన కలిగిస్తున్నాయి..
- సామాన్యుడు అట్టుడిగిపోతున్నాడు.. అన్యాయమై పోతున్నాడు..
- న్యాయస్థానాలున్నాయనే దైర్యం నానాటికీ అడుగంటిపోతోంది..
- కనిపించని భగవంతుడి కంటే.. కనిపించే కోర్టులను నమ్ముతాం..
- కోర్టులు కరప్ట్ అయితే ఇంకెవరికి చెప్పుకోవాలి..
- అమ్ముడుపోతున్న న్యాయ వ్యవస్థ.. తప్పని అవస్థ..
- చట్టాల్లోని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న నేరగాళ్లు..
- అవినీతి పరులకు తమవంతు సహకారం అందిస్తున్న కొందరు న్యాయవాదులు..
- న్యాయస్థానాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న రాజకీయ ముష్కరులు..
- సామాన్యుడికి ఒకన్యాయం.. పెద్దలకు ఒక న్యాయం ఈ అంతరం నశించాలి..
- విద్య, వైద్యం, న్యాయం సామాన్యుడి జన్మహక్కుగా స్థిరపడాలి..
- ఆలోచింపజేస్తున్న ఒక రాజకీయ నాయకుడి మాటలు..
- న్యాయవాది, పొలిటిషన్ రఘునందన్ రావు చెప్పిన మాటలు అక్షర సత్యాలు..
- న్యాయవ్యవస్థ ప్రక్షాళన జరగకపోతే ఈ సమాజం నశిస్తుందని హెచ్చరిస్తున్న
" ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "
ఒక వ్యక్తి తనకు అన్యాయం జరిగిందని తన తల్లి దండ్రులకు చెప్పుకుంటాడు.. స్నేహితులకు చెప్పుకుంటాడు.. పెద్ద మనుషులకు చెప్పుకుంటాడు.. అధికారులకు చెప్పుకుంటాడు.. పోలీసులకు చెప్పుకుంటాడు.. అప్పటికీ న్యాయం జరక్కపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడు.. అయితే దృరదృష్టం ఏమిటంటే ఆ న్యాయస్థానాలు అన్యాయ కూపాలుగా మారిపోతే ఇక ఆ వ్యక్తి ఎవరికీ చెప్పుకోవాలి..? చివరికి మరణాన్ని ఆశ్రయిస్తాడు.. ఈ మాటలు వినడానికి కొంచం ఆశ్చర్యాన్ని కలిగించినా ఇదే వాస్తవం.. కదులుతున్న కాలంతోబాటు జరుగుతున్న వ్యవహారం.. గుడిలోని దేవుడే రక్కసుడిగా మారి రక్తం తాగుతుంటే.. ఇక రక్షణ ఎక్కడుంటుంది..? ఇలాంటి దారుణ పరిస్థితులే ఇప్పుడు న్యాయ వ్యవస్థలో చోటుచేసుకుంటున్నాయి.. ఎన్నెన్నో దృష్టాంతాలు చూస్తున్నాం.. ఎన్నెన్నో వార్తలు వింటున్నాం.. నోట్ల కట్టలతో న్యాయమూర్తులు దొరికిపోతున్నారు.. అన్యాయం వైపు వాదిస్తున్న న్యాయవాదులను చూస్తున్నాం.. చట్టాలను తారుమారు చేస్తున్న లాయర్లను చూస్తున్నాం.. న్యాయాన్ని బంధించి, అన్యాయానికి పట్టం గడుతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.. న్యాయదేవత కళ్ళకు గంతలు కడతారు.. నిజా నిజాలను ఆమె చూడలేదు.. కేవలం సాక్షులు చెప్పే విషయాలు మాత్రమే వింటుంది.. ఇదే అదనుగా, ఇదే సాకుగా చేసుకుంటున్న కొందరు న్యాయవాదులు చట్టాల్లోని లొసుగులు, క్లాజులు బూతద్దం పెట్టి వేడికి మరీ న్యాయాన్ని ఖూనీ చేస్తున్నారు.. అన్యాయం చేసినవారిని అందలం ఎక్కిస్తున్నారు.. ఇక్కడ డబ్బు ముఖ్యమైన భూమిక పోషిస్తోంది.. డబ్బులు పడేస్తే న్యాయస్థానాలను మేనేజ్ చేసేయ్యొచ్చు అనే ధైర్యం నేరస్తుల్లో నాటుకుని పోయింది.. ఒక దారుణమైన సంఘటన ఇక్కడ చెప్పుకోవాలి.. భారత దేశంలోని ఒక నగరంలో సాయంకాల పూట సముద్రపు ఒడ్డున ఎన్నో ఫ్యామిలీలు సేద తీరుతున్నాయి.. ఒడ్డుకు చేరుతున్న అలలతో ఆడుకుంటూ ఆనందంగా కాలం గడుపుతున్నాయి.. వారందరిలో ఒక న్యాయమూర్తి, ఒక సాధారణ లాయర్, ఒక ప్రముఖ పేరొందిన న్యాయవాది తమ తమ కుటుంబాలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.. ఆ సాధారణ లాయర్ ఒక కేసులో నేరం చేసిన వారికి శిక్షపడేలా వాదించాడు.. ఇక ఆ నేరస్తుడికి సంబంధించిన వారు ఆ లాయర్ పై పాగా పట్టారు.. ఆ రోజు కొందరు దుండగులు ఆబీచ్ కి చేరుకున్నారు.. తన కుటుంబంతో కలిసి ఆడుకుంటున్న సాధారణ లాయర్ ని అత్యంత దారుణంగా నరికి చంపారు.. ఆ దారుణ ఘటనను స్వయంగా అక్కడే ఉన్న న్యాయమూర్తి చూశాడు.. అక్కడే ఉన్న ప్రముఖ న్యాయవాది సైతం చూశాడు.. హంతకులు అరెస్ట్ అయ్యారు.. అత్యంత హేయమైన విషయం ఏమిటంటే ఆ హంతకుల తరఫున ప్రముఖ న్యాయవాది వాదించాడు.. అక్కడ న్యాయమూర్తి సాక్షాత్తూ హత్యను చూశాడు.. అయితే ఆ న్యాయమూర్తి సమక్షంలోనే, ఆ ప్రముఖ న్యాయవాది హంతుకుల తరఫున వాదించి, వారు నిర్దోషులని నిరూపించాడు.. చూసిన న్యాయమూర్తి సైతం ఏమీ చేయలేని పరిస్థితి.. అలాంటి సాక్షాలు సృష్టించాడు ఆ ప్రముఖ న్యాయవాది.. ఇలా ఉంటుంది వ్యవహారం.. ఇది కేవలం కథ కాదు.. ఒకప్పుడు ముంబైలో జరిగిన యదార్ధ సంఘటన.. ఆ తరువాత ఆ ప్రముఖ న్యాయవాది ఎంపీగా కూడా ఈ దేశానికి, ప్రజలకు సేవలందించారు.. మరి న్యాయం ఎక్కడుంది..? గుడ్డిదైపోయింది..
ప్రజాస్వామ్య దేశంలో న్యాయవ్యవస్థకు ఉన్న ప్రాముఖ్యత అప్రతిహతం. శాసన, కార్యనిర్వాహక విభాగాల కంటే ఎత్తైన స్థాయిలో నిలిచి, ప్రజల హక్కులను కాపాడేది కోర్టే. న్యాయస్థానం అనేది ప్రజల చివరి ఆశ్రయం. కానీ అదే న్యాయస్థానంలో అవినీతి వేళ్లూనుకపోతే.. ప్రజల విశ్వాసం ఏ స్థాయికి కూలిపోతుందో అంచనా వేయడం కష్టం.
అవినీతి రూపాలు ఇలా ఉన్నాయి :
కేసులు త్వరగా ముందుకు కదలడానికి లంచాలు అవసరమవుతున్నాయనే ఆరోపణలు. ఫైళ్ళను ముందుకు జరిపే కోర్టు సిబ్బందిపై నమ్మకం లేకపోవడం. ధనికులు, రాజకీయ నాయకులు, అధికారులకు అనుకూలంగా తీర్పులు రావడం. బలహీన వర్గాలను బలవంతంగా రాజీకి ఒప్పించడం లాంటివి జరుగుతున్నాయి..
ప్రజలపై ప్రభావం :
ఇలాంటి అవినీతి కారణంగా పేదలు, మధ్యతరగతి వారు ఎక్కువగా నష్టపోతున్నారు. ధనికులు డబ్బుతో మార్గం సుగమం చేసుకోగలిగినా, సాధారణ పౌరులు లంచం ఇవ్వలేక ఇరుక్కుపోతున్నారు. న్యాయం ఆలస్యమవడం వల్ల వారు నష్టపోగా, న్యాయవ్యవస్థపై వారి విశ్వాసం తగ్గిపోతోంది. విశ్వాసం కోల్పోయిన న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టలేకపోతుంది.
పరిష్కార మార్గాలు :
కోర్టు వ్యవహారాల్లో పారదర్శకత పెంచడం. డిజిటల్ టెక్నాలజీ వినియోగం.. ఆన్లైన్ ఫైలింగ్, ఈ-కోర్టులు, వర్చువల్ విచారణలు.
అవినీతిలో పట్టుబడిన జడ్జీలు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి.. విచారణ కాలపరిమితి అమలు చేయాలి.. కేసులు సంవత్సరాల తరబడి లాగకూడదనే నిబంధన విధించాలి.. ప్రజల్లో జాగృతిని పెంచడం.. తమ హక్కులు, కోర్టు విధానాలపై అవగాహన కల్పించడం ఖచ్చితంగా చేయాలి..
ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థే చివరి భరోసా. ఆ భరోసా దెబ్బతింటే ప్రజాస్వామ్య పునాది కదిలిపోతుంది. అందుకే కోర్టుల్లో అవినీతిని నిర్మూలించడం అత్యవసరం. ప్రజలు కోర్టు తలుపు తడితే తప్పకుండా న్యాయం దొరుకుతుందనే విశ్వాసం ఉండాలి. న్యాయవ్యవస్థను శుభ్రంగా ఉంచడం కేవలం న్యాయవిధుల బాధ్యత మాత్రమే కాదు, సమాజమంతటికీ ఉన్న బాధ్యత అని తెలియజేస్తోంది " ఫోరం ఫార్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "
ఒకసారి న్యాయవాది, బీజేపీ నాయకుడు రఘునందన్ చెప్పిన మాటలు మననం చేసుకుందాం :
భారతదేశ ప్రజాస్వామ్యం నిలదొక్కుకోవడానికి న్యాయవ్యవస్థే ప్రధాన ఆధారం. కానీ, న్యాయం ఆలస్యమవుతుందనే విమర్శలు కొత్తవి కావు. కేసులు దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉండిపోవడం, తీర్పులు సమయానికి రాకపోవడం, సామాన్య ప్రజలకు న్యాయం దూరమవ్వడం అన్నీ మన దేశ న్యాయవ్యవస్థలో తీవ్రమైన లోపాలుగా ముద్ర పడ్డాయి.
ఇటీవల బీజేపీ నేత రఘునందన్ రావు ఒక పోడ్ కాస్ట్ చేసిన వ్యాఖ్యలు ఈ సమస్యను మరింత బలంగా గుర్తు చేశాయి. ఆయన చెప్పినట్లు, కోట్లకొద్దీ కేసులు పెండింగ్లో ఉండటమే కాకుండా, రాజకీయ నాయకులపై ఉన్న నేర కేసులు కూడా ఏళ్ల తరబడి పరిష్కారం లేకుండా ఉండిపోతున్నాయి. “543 మంది ఎంపీల్లో ఎక్కువమందిపై కేసులు ఉన్నాయి. తనతో సహా చాలామందిపై కేసులు ఉన్నాయి. ఈ భారాన్ని మోస్తూనే రాజకీయాలు చేయాల్సి వస్తోంది” అని ఆయన వ్యక్తం చేసిన ఆవేదన కేవలం వ్యక్తిగతం మాత్రమే కాదు; మొత్తం వ్యవస్థ ఎదుర్కొంటున్న వాస్తవానికి ప్రతిబింబం.
ఇక మరో ముఖ్యమైన అంశం.. న్యాయ వ్యవస్థపై వస్తున్న విమర్శలు. ప్రజలు కోర్టులను విమర్శిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదని, ఆత్మపరిశీలన చేసుకోవాలని రఘునందన్ రావు చెప్పిన మాటలు సరికొత్త ఆలోచనకు దారి తీస్తాయి. విమర్శను శత్రువుగా కాకుండా, మార్పు కోసం తీసుకోవడం న్యాయవ్యవస్థకు అవసరమైన ధోరణి.
అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం న్యాయ సంస్కరణలు. రాజకీయాల్లో ఎన్నో విషయాలపై చర్చలు జరుగుతున్నా, న్యాయవ్యవస్థలో మార్పులపై ఎవరూ పెద్దగా మాట్లాడటం లేదు. “ప్రజల జీవితానికి అత్యంత దగ్గరగా ఉండేది న్యాయవ్యవస్థే. కాబట్టి సంస్కరణలు అత్యవసరం” అని రఘునందన్ రావు చెప్పిన మాటలు ఒక హెచ్చరిక.
న్యాయవాదుల పాత్ర కూడా ఇక్కడ ముఖ్యమే. న్యాయవాదులు కేవలం కేసులు వాదించే వారే కాకుండా, సమాజానికి న్యాయం అందించే బాధ్యత వహించాలి. రఘునందన్ రావు చెప్పినట్లుగా, న్యాయ వృత్తి మరియు ప్రజా జీవితం మధ్య ఎటువంటి భేదం ఉండకూడదు.
న్యాయవ్యవస్థపై వస్తున్న విమర్శలు వాస్తవానికి దాని బలహీనతలను బహిర్గతం చేస్తున్నాయి. వాటిని నిర్లక్ష్యం చేయడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. కాబట్టి, కేసుల పరిష్కారంలో వేగం పెరగడం, పారదర్శకత కలగడం, ప్రజలకు సమయానికి న్యాయం అందించడం అత్యవసరమైంది. రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు ఒక నేతగా ఆయన ఆవేదన మాత్రమే కాదు, ఈ దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుపై ఆందోళనగల ప్రతి పౌరుడి గళం.