
ప్రమాదాల నివారణ కోసం కాటమయ్య రక్షక కిట్లను గీత కార్మికులు తప్పనిసరిగా వినియోగించాలని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి 80 మంది లబ్ధిదారులకు శుక్రవారం కాటమయ్య కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... కల్లుగీత కార్మికులకు పూర్తి స్థాయిలో కాటమయ్య రక్షక కిట్లను అందించే దిశగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నీటి వనరుల్లో చేప పిల్లల విడుదల, కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షక కిట్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.
ఈత చెట్లు ఎక్కే సమయంలో కార్మికులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా సాంకేతికంగా, శాస్త్రీయంగా కాటమయ్య రక్షక కిట్లను తయారుచేయడం జరిగిందని అన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం వంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు భరోసా కల్పించామని అన్నారు. రైతులకు మద్దతుగా 21 వేల కోట్లతో 2 లక్షల వరకు పంట రుణమాఫీ, 9 రోజులలో 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ, క్వింటా సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ వంటి కార్యక్రమాలను అమలు చేశామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ ద్వారా పేదలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన రేషన్ కార్డు సమస్యలను ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పరిష్కరించి 7 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామని అన్నారు. పేదలకు అండగా ఉండే మన ప్రభుత్వం మొదటి విడత నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసామని అన్నారు. రాబోయే రోజులలో ప్రతి ఒక్క అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ళను ప్రజా ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. గీత కార్మికుల సమస్యల తొలగించేందుకు ప్రభుత్వం భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి, కూసుమంచి మండల తహసీల్దార్ రవి కుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.