ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మంత్రి కొండా సురేఖ
హనుమకొండ ప్రతినిధి(భారత శక్తి)ఆగష్టు15:79 వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను హనుమకొండ జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. జెండా ఆవిష్కరణ అనంతరం పరేడ్ వాహనంలో మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ లకు వివిధ విభాగాల పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. జిల్లా ప్రజలకు, అధికారులకు, కవులు, కళాకారులకు మంత్రి సురేఖ 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన సమగ్ర వివరాల నివేదికను రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చదివారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు జాతీయ భావాన్ని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. పలు దేశభక్తి గీతాలకు విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో జిల్లా టాపర్లుగా నిలిచిన పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, కళాశాలల విద్యార్థులకు పదివేల చొప్పున ఎనిమిది మంది విద్యార్థులకు 80 వేల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా విద్యాశాఖ అధికారులు అందజేశారు. విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం తో పాటు ప్రశంసా పత్రాలను అందించారు.