ప్రజా సంక్షేమమే.. ప్రభుత్వ ధ్యేయం
మంత్రి సీతక్క
- ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ములుగు జిల్లా ప్రతినిధి, ఆగస్టు 15 (భారతశక్తి) : ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ-శిశు, సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానం లో శుక్రవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై త్రివర్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వేడుకలకు విచ్చేసిన చిందం రాజా మల్లు స్వాతంత్ర సమరయోధునికి మంత్రి సన్మానించారు.
ముఖ్య అతిథి జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా అధికారులకు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. డి ఆర్ డి ఏ ద్వారా మహిళ సంఘాలకు బ్యాంకు లింకేజి రుణాలు 492 సంఘాలకు, 31 కోట్ల 50 లక్షల చెక్కును జిల్లా సమాఖ్య సభ్యులకు మంత్రి అందచేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ఇద్దరు లబ్ధిదారులకు కుట్టు మిషన్ లను పంపిణీ చేశారు. 10వ తరగతి, ఇంటర్ లో టాపర్లు గా నిలిచిన 4 విద్యార్థులకు 10 వేల చోప్పున బహుమానం అందించారు. మెప్మా క్రింద 148 స్వయం సహాయక మహిళా సంఘాలకు 17 కోట్ల 36 లక్షల 98 వేల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పంద్రాగస్టు వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి.
