
తెలంగాణా రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ రంగాలలో అగ్రగామిగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంటు ను రూపొందిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పనలో ప్రతి ఒక్క పౌరుడి భాగస్వామ్యం ఉండేలా సిటిజన్ సర్వే చేపట్టారు. అక్టోబర్ 10వ తేదీన ప్రారంభమైన ఈ సర్వేలో రాష్ట్ర ప్రజలు, ఎన్.ఆర్.ఐ లు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. కాగా ఈ తెలంగాణ రైజింగ్ విజన్ -2047 సర్వేలో రాష్ట్రంలో వివిధ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ పాల్గొని తమ విలువైన సలహాలు, సూచనలు అందించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది. ఈ నెల 25 వ తేదీ వరకు జరిగే విజన్-2047 సర్వేలో అందరు ఉద్యోగులు పాల్గొనడంతో పాటు ఈ సర్వే యొక్క లింక్ ను, క్యూ ఆర్ కోడ్ ను తమ తమ కార్యాలయాల్లో ప్రదర్శించడంతో పాటు విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా రామ క్రిష్ణా రావు జారీ చేసిన ఆ సర్క్యులర్ లో ఆదేశించారు. ఈ సర్వేలో పాల్గొనేందుకుగాను http //www.telangana.gov.in/telanganarising/ అనే లింక్ ద్వారా పాల్గొనాలని సీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.