ప్రతి పాత్రికేయునికి ఇళ్లు,ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
: టీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎ.కొమురయ్య
ములుగు జిల్లా ప్రతినిధి :

జిల్లాలో పనిచేస్తున్న ప్రతి పాత్రికేయునికి ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయు) రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎనగందుల కొమురయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో జర్నలిస్టులకు అదిగో ఇండ్లు ఇదిగో ప్లాట్లు అన్నట్లుగా వ్యవహరించింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా జర్నలిస్టులను రేవంత్ రెడ్డి సర్కారు విస్మరించిందని ఆయన ఆరోపించారు.
గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉండి, 2023 అసెంబ్లీ ఎన్నికల హామీలలో భాగంగా జర్నలిస్టుల కోసం ఇది చేస్తాం అది చేస్తాం మీ బాధలు మాకు తెలుసు, జర్నలిస్టులకు అండగా ఉంటామని తాము అధికారంలోకి రాగానే మిమ్మల్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చి జర్నలిస్టులను ఆదమరిచిందని ఆయన విమర్శించారు.
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా.. అన్నట్లుగా ములుగు జిల్లాలో గత పాలనాధికారి కలెక్టరేట్ సిబ్బందికి, వివిధ ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులుగా పని చేస్తున్న సిబ్బందికి ఏ ఆంక్షలు లేకుండా ప్రభుత్వ భూములను అధికారులు, ప్రజాప్రతినిధులు ఇండ్ల ప్లాట్లను అప్పనంగా అప్పచెప్పారు. జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల విషయానికి వచ్చేసరికి ఎక్కడ లేని ఆంక్షలు విధించి, జర్నలిస్టులకు ఇండ్లు ఇంటి స్థలాలు ఇవ్వడానికి అడ్డుకట్ట వేస్తున్నారు ఇదెక్కడి అన్యాయమని పేర్కొన్నారు.
