స్థానిక ఎన్నికల్లో చక్రం తిప్పనున్న బీసీ రిజర్వేషన్లు.. !
( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )
- ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా మారనున్న బీసీల సంఖ్య..
- గ్రామీణ ప్రాంతాల్లో అధిక ప్రభావం చూపనుంది..
- బీసీ రిజర్వేషన్స్ గణనీయంగా పెంచిన కాంగ్రెస్ పార్టీ..
- కొందరు సీనియర్స్ పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి..
- ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న విపక్షాలు..
- తెలంగాణ జనాభాలో దాదాపు 52 నుంచి 55 శాతం బీసీలే..
- టికెట్ గల్లంతైన అగ్ర వర్ణాల నాయకులు సహరిస్తారా..? అన్నది ప్రశ్నార్థకమే..
- స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్స్ ఎలాంటి ప్రభావం చూపనుంది..? అన్నదానిపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " అందిస్తున్న పరిశోధనాత్మక కథనం..
బీసీల పోరాటం దశాబ్దాలుగా నడుస్తోంది.. మరి ఫలితం అన్నది మనం చూస్తూనే ఉన్నాం.. విచిత్రం ఏమిటంటే పార్టీలన్నీ ఇప్పుడు బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాయి.. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక్కడుగు ముందుకువేసి రిజర్వేషన్స్ అమాంతంగా పెంచేసింది.. నిజంగా వీరికి బీసీల మీద ప్రేమ పుట్టుకొచ్చిందా..? లేక రాజకీయ లబ్దికోసమేనా..? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. కొందరు స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.. మినిమమ్ రిజర్వేషన్స్ 50 శాతం మాత్రమే ఉండాలన్నది ఒక రూల్.. కానీ ఇప్పుడు తెలంగాణాలో దాదాపు 60 నుంచి 70 శాతం వరకు ఉండే అవకాశం ఉంది.. మరి కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ అంశం కార్యరూపం దాలుస్తుందా..? అన్నది కూడా ప్రశ్నార్థకమే.. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ ప్రక్రియను సాధించి తీరతామని కాంగ్రెస్ బల్లగుద్ది చెబుతోంది.. దీనికోసం ఎంతవరకైనా వెళ్తామని చెబుతున్నారు.. కానీ ఇది సాధ్యం కాదని కొందరు మేధావులు, విశ్లేషకులు చెబుతున్నారు.. ఏది ఏమైనా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అనేది ఒక సంచలనం సృష్టిస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి.. మరి ఏమి జరుగనుంది..? అన్నది వేచి చూడాలి..
తెలంగాణ జనాభాలో బీసీలు సుమారు 52శాతం నుంచి 55శాతం వరకు ఉంటారని అంచనా. కాగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ శాతం మరింత ఎక్కువ. స్థానిక ఎన్నికల్లో ఓటు వేయడానికి సామాజిక గణాంకాలే కీలకం. కాబట్టి బీసీ వర్గాల ఓటు ఎటు వెళ్తుందనేదే ఫలితాన్ని నిర్ణయిస్తుంది.
రిజర్వేషన్ ప్రభావంతో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది :
ప్రస్తుతం పంచాయతీ రాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 33శాతం వరకు ఉంటాయి. కొన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో ఈ రిజర్వేషన్ ప్రత్యక్షంగా అధ్యక్ష, చైర్మన్ స్థానాలపైనా ప్రభావం చూపుతుంది. ఫలితంగా, గతంలో ప్రధానంగా ఉన్న రెడ్డి, కమ్మ, ఇతర ఉన్నత కుల నాయకులు ఈ సీట్లలో నిలబడే అవకాశం తగ్గుతుంది. దీని వల్ల బీసీ అభ్యర్థుల పోటీ పెరుగుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్థి ఎంపికలో బీసీలకు అధిక ప్రాధాన్యం వస్తుంది. కొత్త బీసీ రాజకీయ పార్టీలు, సంఘాలు కూడా ప్రాధాన్యం సంపాదించే అవకాశం ఉంది.
రాజకీయ పార్టీల వ్యూహాలు ఒకసారి గమనిస్తే :
ముందుగా కాంగ్రెస్ పార్టీ.. బీసీ ఓటు బ్యాంక్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల బీసీ రిజర్వేషన్ పెంపు, బీసీ జాబ్ గ్యారంటీ వంటి హామీలతో ఆకర్షిస్తోంది.
ఇక బీ.ఆర్.ఎస్. తన పాలనలో బీసీలకు ఇచ్చిన స్థానాల్ని గుర్తుచేసుకుంటూ "మన పార్టీ మీతోనే ఉంది" అనే నినాదంతో ప్రయత్నిస్తోంది. పాత బీసీ నేతలతో కొత్తగా సమీకరణాలు కుదురుస్తోంది.
ఇక పోతే బీ.జీ.పీ. బీసీ మంత్రులు, జాతీయ నాయకుల ద్వారా గ్రామస్థాయిలో బీసీ మద్దతు పెంచే ప్రయత్నం చేస్తోంది. దీని ఫలితంగా, మూడు ప్రధాన పార్టీలు కూడా ఇప్పుడు అభ్యర్థి ఎంపికలో 70శాతం వరకు బీసీలకు అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరి కొత్త బీసీ పార్టీలు వాటి ప్రభావం ఎలా వుండబోతోంది..? :
ఇటీవల ఏర్పడిన కొన్ని బీసీ ఆధారిత పార్టీలు, సంఘాలు కూడా ఈ ఎన్నికల్లో తమ శక్తిని పరీక్షించుకోవాలని చూస్తున్నాయి. చిన్న స్థాయిలో అయినా కొన్ని స్థానాల్లో అవి కీ రోల్ పోషించే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా ప్రధాన పార్టీల ఓటు బ్యాంక్ను విడగొట్టే ప్రమాదం కూడా కలిగిస్తుంది.
అసలు ఎన్ని సీట్లలో ప్రభావం ఉండవచ్చు? :
సుమారు 60శాతం స్థానిక సంస్థల సీట్లలో బీసీ రిజర్వేషన్ లేదా బీసీ ఓటు నిర్ణయాత్మకంగా ఉంటుంది. అందులో కూడా గ్రామ పంచాయతీ స్థాయిలో అయితే 70 నుంచి 80శాతం వరకు బీసీ సమీకరణే ఫలితాన్ని నిర్ణయిస్తుంది.
ఇక చివరగా ఒక విశ్లేషణ :
మొత్తంగా చూస్తే.. బీసీ రిజర్వేషన్ కారణంగా అభ్యర్థుల ఎంపిక నుంచి ఓటు ప్రవర్తన వరకు అన్ని మార్పులు చోటు చేసుకుంటాయి.
ఎవరు బీసీ వర్గాలను ఆకర్షిస్తారో, వాళ్లకే అధిక స్థానాలు వస్తాయి. కొత్త బీసీ నాయకులు, సంఘాలు కూడా ప్రాధాన్యం సంపాదించగలవు.
కాబట్టి స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ప్రభావం కనీసం 50 నుంచి 60శాతం వరకు ఫలితాలపై నేరుగా ఉంటుంది అని చెప్పడం తప్పు కాదు.
ఏది ఏమైనా బీసీ రిజర్వేషన్ అనే అంశం ఈ ఎన్నికల్లో సంచలనమైన ఫలితాలను వెలుగులోకి తీసుకువస్తుంది అన్నది అక్షరాలా వాస్తవం అన్నది కనిపిస్తోందని " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " పరిశోధనలో తేలింది..