
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా : నిర్మల్ జిల్లా పశువులకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం లక్ష్మణచందా మండలం కనకాపూర్ గ్రామంలో నిర్వహించిన పశువుల టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా పశువైద్యులతో కలెక్టర్ మాట్లాడి బ్లూ టంగ్ వ్యాధి నివారణకు ఇచ్చే టీకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్కు సంబంధించిన రిజిస్టర్లు, నమోదు వివరాలను తనిఖీ చేశారు. వర్షాకాలంలో వ్యాధులు విస్తరించే ప్రమాదం ఎక్కువగా ఉండడంతో, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువుల్లో అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యులను సంప్రదించాలని రైతులకు సూచించారు. టీకాల కార్యక్రమాలను సమయానికి పూర్తి చేయాలని, పశు రైతులు తమ పశువులకు విధిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి అంబాజీ, ఎంపిడిఓ రాధా రాథోడ్, పశువైద్య అధికారి శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.